భారత సైన్యానికి అమెరికా అండ.. 428 మిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీకి ఆమోదం

  • భారత్‌కు 428.2 మిలియన్ డాలర్ల సైనిక సహాయ ప్యాకేజీకి అమెరికా ఆమోదం
  • అపాచీ హెలికాప్టర్లు, M777 హోవిట్జర్ల నిర్వహణకు ఒప్పందం
  • ఇండో-పసిఫిక్‌లో భారత్‌ను కీలక రక్షణ భాగస్వామిగా పేర్కొన్న అమెరికా
  • రెండు దేశాల మధ్య బలపడుతున్న రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు
భారత్-అమెరికా రక్షణ సంబంధాలు మరింత బలపడ్డాయి. భారత సైనిక సామర్థ్యాన్ని పెంచే దిశగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అపాచీ హెలికాప్టర్లు, M777 హోవిట్జర్ల నిర్వహణ, మద్దతు కోసం సుమారు 428.2 మిలియన్ డాలర్ల విలువైన రెండు సైనిక ఒప్పందాలకు అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మే 18న అమెరికా కాంగ్రెస్‌కు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది.

ఈ ఒప్పందాల్లో మొదటిది M777A2 అల్ట్రా-లైట్ హోవిట్జర్ల దీర్ఘకాలిక నిర్వహణకు సంబంధించింది. దీని విలువ 230 మిలియన్ డాలర్లు. ఈ ప్యాకేజీలో విడిభాగాలు, మరమ్మతులు, శిక్షణ, సాంకేతిక సాయం, ఫీల్డ్ సర్వీస్ వంటివి ఉంటాయి. ఈ ఒప్పందానికి బీఏఈ సిస్టమ్స్ ప్రధాన కాంట్రాక్టర్‌గా వ్యవహరించనుంది.

రెండో ఒప్పందం AH-64E అపాచీ హెలికాప్టర్ల నిర్వహణకు సంబంధించినది. దీని విలువ 198.2 మిలియన్ డాలర్లు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్, సాంకేతిక, లాజిస్టిక్స్ మద్దతు, సిబ్బందికి శిక్షణ వంటి సేవలు అందిస్తారు. బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు ఈ ఒప్పందానికి ప్రధాన కాంట్రాక్టర్లుగా ఉన్నాయి.

ఈ ఒప్పందాలు ఇండో-పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో రాజకీయ స్థిరత్వం, శాంతి, ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించడానికి దోహదపడతాయని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ తమకు కీలకమైన రక్షణ భాగస్వామి అని, ఈ ఒప్పందాలతో భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోగలదని తెలిపింది. అయితే, ఈ ఒప్పందాల వల్ల ప్రాంతీయ సైనిక సమతుల్యతలో ఎలాంటి మార్పు ఉండదని, అమెరికా రక్షణ సన్నద్ధతపై కూడా ప్రభావం చూపదని స్పష్టం చేసింది.

India US relations
US military aid
Apache helicopters
M777 Howitzers
military package
defense agreement
BAE Systems
Boeing
Lockheed Martin
Indo Pacific

More Telugu News